కథానిలయం” వెబ్‍సైట్‍కు స్వాగతం

 

తెలుగులో ప్రచురితమైన కథలన్నీ ఒకచోట చేర్చాలనే ఉద్దేశంతో, 1997 ఫిబ్రవరి 22న కాళీపట్నం రామారావుగారు శ్రీకాకుళంలో కథానిలయం సంస్థను ప్రారంభించారు. ఈ ప్రణాళికలో భాగంగా పత్రికలు, కథాసంపుటాలు సేకరించారు. వాటిలోని కథల సూచీని కొంతవరకు తయారుచేశారు.

వివిన మూర్తిగారు 2001లో కథల, రచయితల, పత్రికల సమాచారాన్ని కంప్యూటరీకరించడం మొదలుపెట్టారు. తెలుగుకథ ఆరంభం నుంచి 2010 వరకు లభించిన కథల జాబితా తయారుచేశారు. ఇందులో లక్షకు పైగా కథల, పదహారు వేలమంది రచయితల, రెండువేలకి పైగా పత్రికల వివరాలు ఉన్నాయి.

మనసు ఫౌండేషన్ సౌజన్యంతో 2008 నుంచి కథానిలయంలో స్కానింగ్ ప్రారంభమయింది. తెలుగులో అచ్చయిన ప్రతి అక్షరాన్నీ సాఫ్ట్‌కాపీ రూపంలో భద్రపరచటానికి మనసు ఫౌండేషన్ పూనుకుంది. 2025 నవంబరుకి 3 కోట్ల పేజీల స్కానింగ్ చేయగలిగింది. దానిలో భాగంగా సేకరించిన అనేక పత్రికల, పుస్తకాల నుండి కథల జాబితా కథానిలయం సూచీలోకి చేరాయి. 2011లో మనసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథానిలయం వెబ్‍సైట్ ప్రారంభమయింది. 2014లో కారాగారి నవతీకరణం సందర్భంగా 90వేల కథల సూచీని, 40వేలకు పైగా కథల పీడీఎఫ్‍లు కథానిలయం వెబ్‍సైట్‍లో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ పక్రియలో పూర్తి సాంకేతిక సహకారం వాడపల్లి శేషతల్పశాయి (ఆంధ్రభారతి) అందిస్తున్నారు. కాళీపట్నం సుబ్బారావు, శ్యామనారాయణ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం లక్షా 40వేల కథల వివరాలు, 75వేల కథలకు పైగా పీడీఎఫ్‍లు వెబ్‍సైట్‍లో ఉన్నాయి. పత్రికల, పుస్తకాల సాప్ట్‌కాపీలనుంచి కథల పీడీఎఫ్‍లను విడిగా తయారు చేసే బృహత్తరమైనపనిలో సింహభాగం 'కథా' రమణమూర్తిగారు చేసారు.

అపరాధ పరిశోధన, బాలల తదితర ప్రక్రియల కథలు త్వరలో వెబ్‍సైట్‍లో లభ్యమవుతాయి. అలాగే ఇంటర్నెట్‍పత్రికలలో వచ్చే కథల లింకులు కూడా వెబ్‍సైట్‍లో చేరుతాయి.

ఎవరికైనా తమ కథలు వెబ్‍సైట్‍లో ఉండటం పట్ల అభ్యంతరాలుంటే తెలియజేయండి (kathanilayam@gmail.com). సమాచారం మాత్రం ఉంచి, వెంటనే ఆ కథల పీడీఎఫ్‍లు తొలగించబడతాయి.

ప్రస్తుతం “కథానిలయం”లోని కథలు: 75522
5068311 మంది చదివారు.